సమాజ నిర్మాణానికి సాహిత్యం ఇంధనం వంటిదయితే సమాజపు రూపు రేఖల్ని యేర్పరిచి, మెరుగు దిద్దే యంత్రం లాంటిది సామాజిక కృషి. మనిషి ఉనికి చిరకాలం కొనసాగడానికి, సామాజిక పురోగతీ, శ్రేయస్సుల ఫలాలు ప్రతి మనిషికీ, ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజా శ్రేణులకు అందేలా చెయ్యడానికి, మానవతా విలువలు ఎల్లెడలా కాపాడడానికి, వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సుగా- సమాజ శ్రేయస్సు ప్రతి వ్యక్తి బాధ్యతగా సామాజిక న్యాయం కోసం తమ ఆలోచనలనూ ఆకాంక్షలనూ సాకారం చేసుకునేందుకు ఒక నిర్దిష్ట ఉద్యమ రూపం లోసామూహికంగానైనా వ్యక్తిగతంగానైనా చేసే కార్యాచరణే సామాజిక కృషి. సామాజిక శాస్త్ర పుటల్లో ఏ పాంత చరిత్రకూ తీసి పోనిది మన చరిత్ర, అందులోనూ గత ఆరు దశాబ్దాలుగా ఆత్మగౌరవం కోసం సాగిస్తున్న ఉద్యమ చరిత్ర మన మన తెలంగాణా చరిత్ర. మన తెలంగాణా సమాజంలో, సామాజిక పురోగతీ, సమాజ శ్రేయస్సు కొరకు , అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై అహరహం కృషి చేస్తున్న యెందరో వ్యక్తులూ, సమూహాలూ సంస్థలూ ఉన్నాయి. హిమవన్నగం లాంటి ఆ సామాజిక కృషిని ఉడతా భక్తిగానైనా గుర్తించి గౌరవించాలని తేనా భావిస్తున్నది. అట్లా తెలంగాణ సామాజిక నిర్మాణంలో భాగం పంచుకోవాలని అనుకున్నది.
ప్రాచీన నాగరిక సమాజాలైన ఆదివాసీ తెగల మొదలుకొని మార్పును కోరి తోసుకువచ్చిన యూరోపియన్ ఆధునిక పునరుజ్జీవన కాలాన్ని దాటి స్థల కాల పరిస్థితుల నిర్దిష్టతలతో తమవైన విలువలను పునర్నిర్వచించుకుంటున్న తెలంగాణా వంటి ప్రాంతాల వరకూ సాహిత్య కళారంగాలే, సామాజిక ఉద్యమాలు గా ఆయా జాతుల చరిత్ర గమనాన్ని నిర్ధారించడం లో ప్రధాన భూమికలైనవి. ప్రస్తుతం తెలంగాణ ఆస్తిత్వ ఉద్యమ దశ దిశ ను నిర్దేశిస్తున్న పాటలు, కవితలతో జనం ఆకాంక్షలకు ఉపిరులూదిన ఎంతో మంది కవులూ , కళాకారులూ ఇందుకు మంచి ఉదాహరణలు. అంతర్గత, బహిర్గత వలస పాలకుల అణచివేతల్లో తగిలిన గాయాలు గేయాలై, స్థానికుల వెతలన్నీ కథలై, తెలంగాణా ఆకాంక్షల పతాకాలై సాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో తెలంగాణా నవతరం ఆలోచనలకూ, సృజనాత్మకతకూ తగినంత గౌరవమూ, చేయూత యివ్వడం వల్ల అనేకానేక సంఘర్షణల్లోంచీ, ఉద్యమాల్లోంచి పుట్టిన గొప్ప ప్రపంచ రచయితల, ఉద్యమకారుల, సామాజిక శాస్త్రవేత్తల సరసన నిలబడదగిన స్ఫూర్తిని తెలంగాణా రచయితలకూ కళాకారులకు, తెలంగాణా పౌర సమాజానికి సేవ చేసే ప్రతి ఒక్కరికి కల్గించే ఉద్దేశ్యం తో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన సందర్భాన్ని కూడా వినియోగించుకొని, 2014 మొదలు తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ (తేనా) ప్రతి యేటా సాహిత్య కళా శాస్త్ర లఘుచిత్ర పత్రికా రంగాల్లో విశిష్ట కృషికి పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది.
గౌరవప్రదమైన నగదు మొత్తంతో పాటు జ్ఞాపిక, యోగ్యతా పత్రాలు పురస్కార గ్రహీతలకు తేనా, తేనా తెలంగాణ పునరుజ్జీవన గౌరవ పురస్కారాలలో భాగంగా ప్రతి యేటా ఇస్తుంది. తెలంగాణా మేధావులు, రచయితలు, సాహితీవేత్తలు మరియు సామజిక కార్యకర్తలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
బి నర్సింగరావు, ఘంటా చక్రపాణి, ఆల్లం నారాయణ, విమల కటికనేని, ఆమ్మంగి వేణుగోపాల్, వేణు సంకోజు, దేవకీ తిరునగరి, తస్నీమ్ జోహార్ సలహా సంఘం సభ్యులుగా వ్యవహరిస్తారు.
తేనా సభ్యులు నారాణస్వామి వెంకటయోగి, వెంకట్ మారోజు, అమర్ కరిమిల్ల, శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి, హరికృష్ణ వంగల కార్యక్రమ అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు.